Bath-Sheba గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఒక రోజు సాయంత్రం దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, అక్కడినుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది.
ఆమె గురించి వివరాలు తెలుసుకొని రమ్మని దావీదు ఒక వ్యక్తిని పంపించాడు. అతడు వచ్చి, “ఆమె ఎలీయాము కుమార్తెయైన బత్షెబ, హిత్తీయుడైన ఊరియాకు భార్య” అని చెప్పాడు.
ఆమెను తీసుకురావడానికి దావీదు తన మనుష్యులను పంపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆమెతో పడుకున్నాడు. ఆమె తనకు కలిగిన అపవిత్రతను శుద్ధి చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది.
ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది.
అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?
కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని కాపాడుకోడానికి నేను నీకొక సలహా ఇస్తాను.
నీవు రాజైన దావీదు దగ్గరకు వెళ్లి, ‘నా ప్రభువా, రాజా, “నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడు నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు” అని మీరు నాకు ప్రమాణం చేయలేదా? ఇప్పుడు అదోనియా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
నీవు ఇంకా రాజుతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలికి వచ్చి మీ మాటలను బలపరుస్తాను” అని సలహా ఇచ్చాడు.
కాబట్టి బత్షెబ తన గదిలో ఉన్న వృద్ధుడైన రాజు దగ్గరకు వెళ్లింది. అక్కడ షూనేమీయురాలైన అబీషగు రాజుకు సేవ చేస్తూ ఉంది.
బత్షెబ రాజు ఎదుట తలవంచి, సాగిలపడింది. “నీకేమి కావాలి?” అని రాజు అడిగాడు.
ఆమె అతనితో ఇలా అన్నది, “నా ప్రభువా, మీరు మీ దేవుడైన యెహోవా పేరిట మీ దాసురాలనైన నాతో ఇలా ప్రమాణం చేసి, ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజుగా నా సింహాసనం మీద కూర్చుంటాడు’ అని అన్నారు.
కాని ఇప్పుడు అదోనియా రాజయ్యాడు, నా ప్రభువా, రాజువైన మీకు దీని గురించి తెలియదు.
అతడు విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి అర్పించి, రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సేనాధిపతియైన యోవాబును ఆహ్వానించాడు కాని మీ సేవకుడైన సొలొమోనును ఆహ్వానించలేదు.
నా ప్రభువా నా రాజా, మీ తర్వాత మీ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయులందరు ఎదురుచూస్తున్నారు.
అంతేకాక, నా ప్రభువైన రాజు మరణించి తన పూర్వికులను చేరిన వెంటనే, నేను నా కుమారుడైన సొలొమోను నేరస్థులుగా పరిగణించబడతాము.”
ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే, ప్రవక్తయైన నాతాను వచ్చాడు.
“నాతాను ప్రవక్త ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటకు వెళ్లి తలవంచి సాష్టాంగపడ్డాడు.
నాతాను, “నా ప్రభువా, నా రాజా, అదోనియా మీ తర్వాత రాజవుతాడని, మీ సింహాసనం మీద కూర్చుంటాడని మీరు ప్రకటించారా?
ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు.
కాని మీ సేవకుడనైన నన్ను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైనా బెనాయాను, మీ సేవకుడైన సొలొమోనును అతడు ఆహ్వానించలేదు.
నా ప్రభువైన రాజు తన తర్వాత సింహాసనంపై ఎవరు కూర్చోవాలో తన సేవకులకు చెప్పకుండా ఇలా చేస్తారా?” అన్నాడు.
అప్పుడు రాజైన దావీదు, “బత్షెబను లోపలికి పిలువండి” అన్నాడు. ఆమె రాజు సముఖానికి వచ్చి అతని ఎదుట నిలబడింది.
అపుడు రాజు ప్రమాణం చేసి, “నన్ను ప్రతి ఆపద నుండి కాపాడిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నేను చేసిన ప్రమాణాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెరవేరుస్తాను: నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత రాజవుతాడు, అతడు నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు” అన్నాడు.
అప్పుడు బత్షెబ తలవంచి, రాజు ఎదుట సాష్టాంగపడి, “నా ప్రభువా, రాజైన దావీదు చిరకాలం జీవించును గాక!” అని అన్నది.