Skip to content
మత్తయి 21:33-46

మత్తయి 21:33-46

33
“మరొక ఉపమానం వినండి: ఒక యజమాని తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు.
34
కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.
35
“ఆ రైతులు అతని దాసులను పట్టుకున్నారు; వారు ఒకని కొట్టారు, ఒకని చంపారు, మరొకని మీద రాళ్లు విసిరారు.
36
ఆ యజమాని ఇతర దాసులను, మొదటిసారి కంటే ఎక్కువ మంది పంపాడు, ఆ కౌలు రైతులు వీరిని కూడా ముందు చేసినట్టే చేశారు.
37
చివరికి ఆ యజమాని, ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుని వారి దగ్గరకు పంపాడు.
38
“కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకుందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు.
39
కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
40
“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ కౌలురైతులను ఏమి చేస్తాడు?”
41
అందుకు, “ఆ దుష్టులను కఠినంగా నిర్మూలం చేస్తాడు, కోతకాలంలో తనకు రావలసిన పంటను సక్రమంగా చెల్లించే వేరే కౌలురైతులకు ఆ ద్రాక్షతోటను అద్దెకు ఇస్తాడు” అని వారు జవాబిచ్చారు.
42
అయితే యేసు వారితో, “లేఖనాల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడు చదువలేదా: “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది. ఇది ప్రభువే చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’
43
“కాబట్టి దేవుని రాజ్యం మీ నుండి తీసివేసి, ఆయన దానిని ఫలింపచేసే ప్రజలకు ఇస్తాడు అని మీతో చెప్తున్నాను.
44
ఈ రాయి మీద పడినవారు ముక్కలైపోతారు గాని ఎవరి మీద ఈ రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
45
ముఖ్య యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానాలను విని, ఆయన తమ గురించే చెప్పారని గ్రహించారు.
46
కాబట్టి వారు ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు, కాని ప్రజలు ఆయనను ప్రవక్త అని భావించడంతో వారికి భయపడ్డారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options