ఆదికాండము 47:1-12
1
యోసేపు వెళ్లి ఫరోతో, “నా తండ్రి, నా సోదరులు కనాను దేశం నుండి వారి గొర్రెల మందలు, పశువులు, వారి సమస్తంతో వచ్చారు, ఇప్పుడు గోషేనులో ఉన్నారు” అన్నాడు.
2
అతడు తన సోదరులలో అయిదుగురిని ఫరోకు ఎదుట కనుపరిచాడు.
3
ఫరో ఆ సోదరులతో, “మీ వృత్తి ఏంటి?” అని అడిగాడు. “మీ దాసులు మా పూర్వికుల్లా గొర్రెల కాపరులు” అని వారు ఫరోకు జవాబిచ్చారు.
4
వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు.
5
ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు,
6
ఈజిప్టు దేశమంతా నీ ముందుంది; శ్రేష్ఠమైన ప్రాంతంలో నీ తండ్రిని, నీ సోదరులను ఉంచు. గోషేనులో వారు నివసించవచ్చు. వీరిలో ప్రత్యేక సామర్థ్యం కలిగినవారు ఎవరైనా ఉంటే, నా సొంత పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు” అన్నాడు.
7
తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును తీసుకువచ్చి ఫరో ఎదుట కనుపరిచాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత,
8
ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు.
9
యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు.
10
తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు.
11
కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు.
12
యోసేపు తన తండ్రికి, తన సోదరులకు, తన తండ్రి ఇంటివారికందరికి వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారాన్ని కూడా అందించాడు.
Settings