Skip to content
ఆదికాండము 47:13-26

ఆదికాండము 47:13-26

13
అయితే దేశమంతటిలో ఆహారం లేదు ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది; ఈజిప్టు కనాను దేశాలు కరువును బట్టి ఆకలితో అలమటించాయి.
14
యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు.
15
ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు.
16
అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు.
17
కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు.
18
సంవత్సరం ముగిసిన తర్వాత, మరుసటి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి, “మేము మా ప్రభువు నుండి నిజాన్ని దాచలేము, మా డబ్బు అయిపోయింది, మా పశువులు మీకే ఇచ్చాం, ఇక మా శరీరాలు, మా భూమి తప్ప మా ప్రభువుకు ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు.
19
మేము, మా భూమి మీ కళ్లముందే నశించడం బాగుంటుందా? ఆహారం కోసం మమ్మల్ని, మా భూములను కొనండి. మేము మా భూములతో సహా ఫరోకు బానిసలమవుతాము. మేము చావకుండ బ్రతికేలా పొలాలు పాడైపోకుండ మాకు విత్తనాలు ఇవ్వండి” అని మనవి చేసుకున్నారు.
20
కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది,
21
యోసేపు ఈజిప్టు యొక్క సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దు వరకు ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేశాడు.
22
అయితే, యాజకులకు చెందిన భూమిని మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే వారు క్రమంగా ఫరో నుండి బత్తెం పొందుకునే వారు, ఆ బత్తెంతో వారికి సరిపడే ఆహారం ఉంది. కాబట్టి వారు తమ భూమిని అమ్మలేదు.
23
యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి.
24
అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు.
25
అప్పుడు వారు, “మీరు మా జీవితాలను కాపాడారు. ప్రభువా, మామీద మీ దయ ఉంచండి; మేము ఫరోకు బానిసలుగా ఉంటాం” అని అన్నారు.
26
కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options