ఆదికాండము 21:22-34
22
ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు.
23
కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.”
24
అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు.
25
అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు.
26
అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు.
27
అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు.
28
అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు.
29
అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు.
30
అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు.
31
అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ అని పేరు పెట్టారు.
32
బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు.
33
అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు.
34
అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.
Settings