నిర్గమకాండము 9:13-35
13
అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుటకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
14
లేకపోతే భూమి అంతటి మీద నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా ఈసారి నేను నీ అధికారుల పైకి నీ ప్రజలమీదికి నా తెగుళ్ళ యొక్క పూర్తి శక్తిని పంపుతాను.
15
ఈపాటికి నేను నా చేయిని చాచి, నిన్ను నీ ప్రజలను తెగులుతో మొత్తగలిగేవాన్ని, అది మిమ్మల్ని భూమి నుండి తుడిచిపెట్టేది.
16
కాని నేను నా బలాన్ని నీకు చూపించాలని భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.
17
నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు.
18
కాబట్టి రేపు ఈ సమయానికి నేను ఈజిప్టు ఏర్పడిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్నడు పడని భయంకరమైన వడగండ్ల తుఫాను పంపుతాను.
19
కాబట్టి ఇప్పుడే నీ పశువులను నీ పొలంలో ఉన్న సమస్తాన్ని సురక్షితమైన చోటుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించు, ఎందుకంటే ఇంటికి రప్పింపబడక పొలంలోనే ఉన్న ప్రతి మనిషి మీద జంతువుల మీద వడగండ్లు పడతాయి, అప్పుడు మనుష్యులు చనిపోతారు, జంతువులు చనిపోతాయి’ అని చెప్పు” అన్నారు.
20
ఫరో సేవకులలో యెహోవా మాట విని భయపడినవారు తమ బానిసలను తమ పశువులను తమ ఇళ్ళకు త్వరపడి రప్పించారు.
21
అయితే యెహోవా మాటను లక్ష్యపెట్టనివారు తమ బానిసలను తమ పశువులను పొలంలోనే విడిచిపెట్టారు.
22
అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి ఆకాశం వైపు చాపు అప్పుడు ఈజిప్టు అంతా మనుష్యుల మీద జంతువుల మీద ఈజిప్టు పొలాల్లో పెరిగే ప్రతి దాని మీద వడగండ్లు పడతాయి” అని చెప్పారు.
23
మోషే తన కర్రను ఆకాశం వైపు చాచినప్పుడు, యెహోవా ఉరుములను వడగండ్లను పంపినప్పుడు మెరుపులు వేగంగా నేలను తాకాయి. ఈజిప్టు దేశమంతటా యెహోవా వడగండ్లు కురిపించారు.
24
వడగండ్లు పడ్డాయి, మెరుపులు ఇటు అటు మెరిసాయి. ఈజిప్టు దేశమంతా ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఇది అత్యంత భయంకరమైన తుఫాను.
25
ఆ వడగండ్లు ఈజిప్టు దేశమంతటా, పొలాల్లో ఉన్న మనుష్యులను జంతువులను నాశనం చేశాయి; పొలాల్లో పెరుగుతున్నవన్నీ పాడయ్యాయి, ప్రతి చెట్టు విరిగిపోయింది.
26
అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు.
27
అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “ఈసారి నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దోషులము.
28
యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే ఇంతవరకు పడిన ఉరుములు వడగండ్లు చాలు. నేను మిమ్మల్ని వెళ్లనిస్తాను; మీరు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు” అని అన్నాడు.
29
అందుకు మోషే, “నేను పట్టణంలో నుండి బయటకు వెళ్లగానే, నా చేతులు చాపి యెహోవాకు ప్రార్థిస్తాను. అప్పుడు ఉరుములు ఆగిపోతాయి, ఇక వడగండ్లు ఉండవు, కాబట్టి భూమి యెహోవాదే అని నీవు తెలుసుకుంటావు.
30
అయినప్పటికీ నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు” అన్నాడు.
31
అప్పుడు యవలు వెన్నులు వేశాయి అవిసె పూలు పూసాయి కాబట్టి అవి నాశనం చేయబడ్డాయి.
32
గోధుమలు, మరో రకం గోధుమలు ఇంకా ఎదగలేదు, అవి తర్వాత ఎదుగుతాయి కాబట్టి అవి నాశనం చేయబడలేదు.
33
అప్పుడు మోషే ఫరో దగ్గరనుండి బయలుదేరి పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు చేతులు చాపినప్పుడు ఉరుములు వడగండ్లు ఆగిపోయాయి. నేలపై వర్షం కురవడం ఆగిపోయింది.
34
వర్షం వడగండ్లు ఉరుములు ఆగిపోవడం ఫరో చూసినప్పుడు, అతడు మరలా పాపం చేశాడు: అతడు అతని అధికారులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
35
యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఫరో హృదయం కఠినపరచబడింది; అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.
Settings