Skip to content
ద్వితీయోపదేశకాండము 31:14-23

దేవుడు యెహోషువకు బాధ్యత అప్పగించి మతభ్రష్టతను ప్రవచించుట

ద్వితీయోపదేశకాండము 31:14-23
14
ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.
15
అప్పుడు యెహోవా గుడారం దగ్గర మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యారు, మేఘం గుడార ద్వారం మీద నిలిచింది.
16
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.
17
ఆ రోజున నేను వారిపై కోప్పడి వారి చేయి విడిచిపెడతాను; నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారు నాశనమవుతారు. అనేక విపత్తులు, ఆపదలు వారి పైకి వస్తాయి, ఆ రోజు వారు, ‘ఈ విపత్తులు మనపైకి రావడానికి కారణం మన దేవుడు మనతో లేకపోవడం కాదా?’ అని అనుకుంటారు.
18
వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి చేసిన దుష్టత్వాన్ని బట్టి నేను ఆ రోజు ఖచ్చితంగా నా ముఖాన్ని దాచుకుంటాను.
19
“ఇప్పుడు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించి వారితో పాడించండి, అది వారికి వ్యతిరేకంగా నాకు సాక్ష్యంగా ఉంటుంది.
20
నేను వారి పూర్వికులకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువచ్చినప్పుడు, వారు తృప్తిగా తిని లావెక్కినప్పుడు, వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని సేవించి, నన్ను తిరస్కరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తారు.
21
వారి మీదికి అనేక విపత్తులు, ఆపదలు వచ్చి పడతాయి. ఈ అనుభవాలకు సాక్ష్యంగా ఈ పాట పాడుకుంటారు. దీన్ని వారి సంతతివారు ఎన్నడూ మరచిపోరు. ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలో నేను ఇంకా వారిని తీసుకురాకముందే, ఈ రోజే వారేం ఆలోచన చేస్తున్నారో నాకు తెలుసు.”
22
కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.
23
యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options