అపొస్తలుల కార్యములు 20:5-15
5
వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మాకోసం ఎదురు చూస్తున్నారు.
6
కానీ మేము పులియని రొట్టెల పండుగ తర్వాత మాసిదోనియలోని ఫిలిప్పీ పట్టణం నుండి ఓడ ఎక్కి బయలుదేరి, అయిదు రోజుల తర్వాత మిగిలిన వారిని త్రోయ పట్టణంలో కలుసుకొని వారి దగ్గర ఏడు రోజులు గడిపాము.
7
వారం మొదటి రోజున రొట్టె విరవడం కోసం మేము ఒక్కచోట చేరినప్పుడు, పౌలు మరుసటిరోజు వెళ్లిపోవాలి, కాబట్టి వారితో అర్థరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు.
8
మేము సమావేశమైన మేడ గదిలో చాలా దీపాలు ఉన్నాయి.
9
ఆ గది కిటికీ మీద ఐతుకు అనే పేరుగల ఒక యవ్వనస్థుడు కూర్చుని ఉన్నాడు, పౌలు ఇంకా మాట్లాడుతుండగా వాడు మత్తు నిద్రలోకి వెళ్లిపోయాడు. వాడు బాగా నిద్రలోకి వెళ్లినప్పుడు, వాడు మూడవ అంతస్తు నుండి క్రింద నేలపై పడి చనిపోయాడు.
10
అప్పుడు పౌలు క్రిందికి వెళ్లి, ఆ యువకుని మీద పడి, తన చేతులతో కౌగిలించుకుని, “మీరు కంగారుపడకండి, ఇతడు ప్రాణంతో ఉన్నాడు” అని వారితో చెప్పాడు.
11
అతడు మళ్ళీ మేడ గదికి వెళ్లి వారందరితో కలిసి రొట్టెను విరిచి తిన్నాడు. అతడు తెల్లవారే వరకు వారితో మాట్లాడి బయలుదేరి వెళ్లాడు.
12
ఆ యువకుని సజీవంగా ఇంటికి తీసుకుని వెళ్లిన ప్రజలందరు గొప్ప ఆదరణ పొందారు.
13
పౌలును ఎక్కించుకోవాలని, మేము ఓడలో ముందుగా బయలుదేరి అస్సోసు చేరిపోయాము. పౌలు అక్కడికి కాలినడకన రావాలని ఈ ఏర్పాటును చేశాడు.
14
అనుకున్న విధంగానే అతడు మమ్మల్ని అస్సోసులో కలుసుకున్నాడు, మేము అతన్ని మితులేనేకు తీసుకుని వెళ్లాము.
15
మరుసటిరోజు మేము అక్కడినుండి ఓడలో బయలుదేరి కీయోసు చేరి, మరుసటిరోజు సమొసును దాటి, ఆ తర్వాత రోజు మిలేతు చేరుకొన్నాము.
Settings