Skip to content
1 పేతురు 3:8-22

1 పేతురు 3:8-22

8
చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి.
9
కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు.
10
ఎందుకంటే, “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడు మాట్లాడకుండ నాలుకను మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.
11
వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
12
ప్రభువు కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనలను వింటున్నాయి, అయితే ప్రభువు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది.”
13
మంచి చేయాలని మీకు ఆసక్తి ఉంటే, మీకు హాని చేసేది ఎవరు?
14
మీరొకవేళ, నీతి కోసం శ్రమపడినా మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి, కలవరపడకండి.”
15
మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి.
16
మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు.
17
అదే దేవుని చిత్తమైతే, కీడు చేసిన బాధపడడం కంటే, మేలు చేసి బాధపడడమే మంచిది.
18
ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.
19
ఆయన సజీవుడైన తర్వాత, అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు;
20
నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కోసం సహనంతో వేచి ఉన్నారు. ఓడలోని కొద్దిమంది, అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు.
21
ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.
22
ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options