1 రాజులు 22:29-38
29
కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.
30
ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.
31
సిరియా రాజు తన ముప్పై రెండు మంది రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు.
32
అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఖచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని, అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేసినప్పుడు,
33
అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు.
34
అయితే ఒకడు విల్లెక్కుపెట్టి గురి చూడకుండ బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.
35
ఆ రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది, రాజు అరామీయులకు ఎదురుగా తన రథం మీద ఉన్నాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథం అడుగు భాగానికి చేరింది. ఆ సాయంకాలం అతడు చనిపోయాడు.
36
సూర్యాస్తమయం అవుతున్నప్పుడు, “ప్రతి ఒక్కరు తన పట్టణానికి వెళ్లాలి, ప్రతి ఒక్కడు తన దేశానికి వెళ్లాలి!” అనే వార్త సైన్యమంతా వ్యాపించింది.
37
అలా రాజు చనిపోయాడు. వారు అతన్ని సమరయకు తీసుకువచ్చి అక్కడే అతన్ని సమాధి చేశారు.
38
వారు సమరయలో ఒక చెరువు దగ్గర అతన్ని రథాన్ని కడిగారు (అక్కడ వేశ్యలు స్నానం చేసేవారు). యెహోవా చెప్పినట్లే కుక్కలు వచ్చి అతని రక్తం నాకాయి.
Settings