1 రాజులు 22:41-50
41
ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు.
42
యెహోషాపాతు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె.
43
ప్రతీ విషయంలో అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
44
అంతేకాక యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి కలిగి ఉన్నాడు.
45
యెహోషాపాతు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విజయాలు, యుద్ధం విన్యాసాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
46
అతడు తన తండ్రి ఆసా పాలన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయిన ఆలయాలలో ఉన్న పురుష వేశ్యలను దేశంలో నుండి తొలగించాడు.
47
ఆ రోజుల్లో ఎదోము దేశానికి రాజు లేడు; ఒక ప్రాంతీయ అధికారి పరిపాలించేవాడు.
48
యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరుకు వెళ్లడానికి తర్షీషు ఓడలను నిర్మించాడు కాని అవి సముద్రయానం చేయకుండానే ఎసోన్-గెబెరు దగ్గర బద్దలైపోయాయి.
49
అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా మనుష్యులను మీ మనుష్యులతో పాటు ఓడలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు కాని యెహోషాపాతు ఒప్పుకోలేదు.
50
తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన తండ్రి దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
Settings