1 రాజులు 14:21-30
21
సొలొమోను కుమారుడైన రెహబాము యూదాలో రాజుగా ఉన్నాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.
22
యూదా వారు యెహోవా దృష్టిలో చెడు చేశారు. వారు తమ ముందున్న వారికన్నా ఎక్కువ పాపాలు చేసి ఆయనకు ఎక్కువ రోషం పుట్టించారు.
23
వారు తమ కోసం ప్రతి ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, క్షేత్రాలను, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను కూడా నిలిపారు.
24
అంతేకాక, దేశంలో ఉన్న క్షేత్రాల్లో మగ వ్యభిచారులు కూడా ఉన్నారు; యెహోవా ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి వెళ్లగొట్టిన జనాంగాలు చేసిన హేయక్రియలు యూదా వారు చేశారు.
25
రాజైన రెహబాము పాలనలో అయిదవ సంవత్సరం, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.
26
అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన అన్ని బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు.
27
కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు.
28
రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా ఉన్న గదిలో ఉంచేవారు.
29
రెహబాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
30
రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.
Settings