Skip to content

యెషయా21

బబులోనుకు వ్యతిరేకమైన భారవాక్యము

1
సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా ఎడారిలో నుండి భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.
2
భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.
3
కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.
4
నా గుండె దడదడలాడుతుంది భయంతో వణుకు పుడుతుంది; నేను ఇష్టమైన సంధ్యవేళ నాకు భయం పుట్టించింది.
5
వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి.

కాపలాదారుని నివేదిక

6
ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “వెళ్లి కాపలా పెట్టండి అతడు చూసింది తెలియజేయాలి.
7
అతడు రథాలను గుర్రాల జట్లను గాడిదల మీద వచ్చేవారిని ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే అతడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.”
8
కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.
9
చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”
10
నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను.

దూమాను (ఏదోమును) గూర్చిన భారవాక్యము

11
దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”
12
కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.

అరేబియాను గూర్చిన భారవాక్యము

13
అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం: అరేబియా ఎడారిలో బసచేసే దెదానీయులైన యాత్రికులారా,
14
మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి; తేమా దేశ నివాసులారా, పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి.
15
ఖడ్గం నుండి, దూసిన ఖడ్గం నుండి, ఎక్కుపెట్టిన బాణాల నుండి, తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు.
16
ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది.
17
కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options