Reports of Spies గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
వారు పారాను ఎడారిలో కాదేషులో ఉన్న మోషే అహరోనులు, ఇశ్రాయేలు సర్వసమాజం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి, సర్వ సమాజానికి విశేషాలు చెప్పి, ఆ దేశ పండ్లను వారికి చూపించారు.
వారు మోషేకు ఇచ్చిన నివేదిక ఇది: “మీరు పంపిన దేశానికి మేము వెళ్లాము. నిజంగా పాలు తేనెలు అక్కడ పారుతున్నాయి. ఇవి ఆ దేశంలోని పండ్లు.
అయితే అక్కడి నివాసులు బలిష్ఠులు, వారి పట్టణాలు కోటగోడలు కలిగి ఉన్నాయి, చాలా పెద్దవి. అక్కడ అనాకీయులను కూడా చూశాము.
అమాలేకీయులు దక్షిణాదిలో నివసిస్తారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ సీమలో ఉంటారు. కనానీయులు సముద్రతీరాన యొర్దాను నది ఒడ్డున నివసిస్తారు.”
అప్పుడు కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంత పరుస్తూ, “తప్పకుండా మనం వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేయగలం” అని అన్నాడు.
కానీ అతనితో కలసి వెళ్లినవారు, “మనం వారిపై దాడి చేయలేము; అక్కడి ప్రజలు మనకన్నా బలమైన వారు” అని అన్నారు.
వారు పరిశీలించిన దేశం గురించి ఇశ్రాయేలీయుల మధ్య చెడ్డ నివేదికను వ్యాప్తి చేశారు. వారు, “మేము వేగు చూసిన భూమి దానిలో నివసించేవారిని మ్రింగివేస్తుంది. అక్కడ మేము చూసిన ప్రజలందరూ చాలా పెద్దగా ఉన్నారు.
మేము అక్కడ ఆజానుబాహులను (అనాకు వంశస్థులు నెఫిలీము నుండి వచ్చినవారు) చూశాము. మా దృష్టిలో మేము మిడతల్లా కనిపించాం, వారికి కూడా అలాగే కనిపించాం” అని అన్నారు.
ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన వారిలో ఉన్న నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు తమ బట్టలు చింపుకొని,
ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము వెళ్లి పరిశీలించిన దేశం చాలా మంచిగా ఉంది.
యెహోవా మనయందు ఆనందిస్తే, ఆ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపిస్తారు, దానిని మనకు ఇస్తారు.
మీరు మాత్రం యెహోవా మీద తిరగబడకండి. అక్కడి ప్రజలకు భయపడకండి ఎందుకంటే వారిని మనం చంపుతాము. వారికి కాపుదల లేదు, కానీ యెహోవా మనతో ఉన్నారు. వారికి భయపడకండి” అని చెప్పారు.
అయితే సమాజమంతా వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమావేశ గుడారం దగ్గర ఇశ్రాయేలీయులందరికి కనిపించింది.