అపొస్తలుల కార్యములు 17:16-34
16
పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కోసం ఎదురుచూస్తూ, ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందని చూసి ఎంతో దుఃఖించాడు.
17
కాబట్టి సమాజమందిరాల్లో యూదులతో దేవుని భయం కలిగిన గ్రీసు దేశస్థులతో, అదే విధంగా ప్రతిరోజు సంత వీధుల్లో కనిపించే వారందరితో చర్చిస్తూ ఉండేవాడు.
18
ఎపికూరీయ అనే గుంపువారు స్తోయికులలో కొందరు జ్ఞానులు పౌలుతో వాదించసాగారు. వారిలో కొందరు, “ఈ వదరుబోతు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?” అన్నారు. మరికొందరు, “ఇతడు మనకు తెలియని దేవతలను గురించి బోధిస్తున్నాడు” అన్నారు. పౌలు యేసును గురించి పునరుత్థానం గురించి సువార్త ప్రకటించడం వలన వారు అలా అన్నారు.
19
వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయొపగు అనే సభకు తీసుకెళ్లి, “నీవు బోధిస్తున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకుంటాం మాకు చెప్పు!” అని అడిగారు.
20
వారు అతనితో, “నీవు కొన్ని వింతైన ఆలోచనలను మాకు వినిపిస్తున్నావు, మాకు వాటి అర్థం తెలుసుకోవాలని ఉంది” అన్నారు.
21
ఏథెన్సు పట్టణానికి చెందినవారు, అక్కడ నివసించే విదేశీయులు అందరు ఏదైనా ఒక క్రొత్త ఆలోచనల గురించి మాట్లాడుతూ వింటూ తమ కాలాన్ని గడిపేవారు.
22
అప్పుడు పౌలు అరేయొపగు సభలో లేచి నిలబడి, ఈ విధంగా చెప్పాడు, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లోను చాలా భక్తిపరులుగా ఉన్నారని నేను గమనించాను.
23
నేను చుట్టూ తిరుగుతూ మీరు పూజించే వాటిని జాగ్రత్తగా చూసినప్పుడు నాకు కనబడిన ఒక బలిపీఠం మీద, తెలియని దేవునికి, అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక ఆరాధిస్తున్న దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను.
24
“ఈ లోకాన్ని, దానిలోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువు, ఆయన మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో నివసించడు.
25
ఆయనే వారందరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఏదో అవసరం ఉన్నట్లు మానవుల చేతులతో చేసే సేవలు ఆయనకు అవసరం లేదు.
26
ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు.
27
దేవుడు మనలో ఎవరినుండి దూరంగా ఉండరు కాని, ప్రజలు ఆయనను వెదకి కనుగొని ఆయన దగ్గరకు చేరాలని ఆయన ఈ విధంగా చేశారు.
28
‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.
29
“మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు.
30
గతంలో మానవుని అజ్ఞానాన్ని దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కాని ఇప్పుడు ప్రజలందరు ప్రతిచోట పశ్చాత్తాపం పొందాలని ఆయన ఆజ్ఞాపించారు.
31
ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి వారందరికి దీనిని రుజువుపరిచాడు.”
32
వారు మరణం నుండి తిరిగి లేవడం గురించి విన్నప్పుడు, కొందరు హేళన చేయసాగారు కాని మరికొందరు, “ఈ సంగతిని గురించి మేము మరలా వినాలని అనుకుంటున్నాం” అన్నారు.
33
ఆ తర్వాత పౌలు ఆ న్యాయసభ నుండి వెళ్లిపోయాడు.
34
అయితే వారిలో కొందరు పౌలు చెప్పిన మాటలను నమ్మి అతని అనుచరులయ్యారు. వారిలో అరేయొపగు సభ సభ్యుడైన దియొనూసియు, దమరి అనే పేరుగల ఒక స్త్రీ, వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు.
Settings