2 రాజులు 5:20-27
20
ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని అరామీయుడైన నయమాను తెచ్చిన కానుక తీసుకోకుండా ఊరికే వెళ్లనిచ్చాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను అతని వెంట పరిగెత్తి అతని నుండి ఏదైనా తీసుకుంటాను” అని తన మనస్సులో అనుకున్నాడు.
21
కాబట్టి గేహజీ నయమాను వెనకే త్వరగా వెళ్లాడు. నయమాను తన వెనుక ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం గమనించి రథం దిగి అతన్ని కలుసుకొని, “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.
22
గేహజీ, “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపి, ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చారు. దయచేసి వారికి ఒక తలాంతు వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.
23
అందుకు నయమాను, “నీకిష్టమైతే రెండు తలాంతుల వెండి తీసుకో” అని చెప్పి గేహజీని బలవంతంగా ఒప్పించి రెండు సంచుల్లో నుండి రెండు తలాంతుల వెండి, రెండు జతల దుస్తులు పెట్టి, తన సేవకులలో ఇద్దరికి ఇస్తే వారు గేహజీకి ఇవ్వడానికి మోసుకెళ్లారు.
24
గేహజీ కొండ దగ్గరకు చేరగానే అతడు వాటిని ఆ సేవకుల దగ్గర నుండి తీసుకుని వెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత అతడు ఆ మనుష్యులను పంపించేశాడు.
25
అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.
26
అయితే ఎలీషా అతనితో అన్నాడు, “ఆ మనిషి నిన్ను కలుసుకోడానికి రథం దిగి నీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా లేదా? డబ్బు, దుస్తులు, ఒలీవచెట్లు, ద్రాక్షతోటలు, మందలు, పశువులు, దాసదాసీలు తీసుకోవడానికి ఇది సమయమా?
27
నయమాను కుష్ఠు నీకు, నీ సంతానానికీ నిత్యం ఉంటుంది” అని అన్నాడు. వెంటనే గేహజీ చర్మమంతా కుష్ఠు వచ్చి మంచులా తెల్లగా అయ్యింది. అతడు ఎలీషా దగ్గర నుండి వెళ్లిపోయాడు.
Settings