Skip to content
1 రాజులు 15:9-24

1 రాజులు 15:9-24

9
ఇశ్రాయేలు రాజైన యరొబాము పరిపాలనలోని ఇరవయ్యవ సంవత్సరంలో, ఆసా యూదా దేశానికి రాజయ్యాడు.
10
అతడు యెరూషలేములో నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. అబీషాలోము కుమార్తె మయకా అతని అవ్వ.
11
ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
12
క్షేత్రాల్లోని మగ వ్యభిచారులను దేశం నుండి వెళ్లగొట్టాడు, అతని పూర్వికులు చేసిన విగ్రహాలన్నిటిని తొలగించాడు.
13
అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు.
14
అతడు క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు.
15
అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను యెహోవా ఆలయానికి తెచ్చాడు.
16
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
17
ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
18
అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో మిగిలిన వెండి బంగారాలంతా తీసి తన అధికారులకు అప్పగించి, దమస్కులో పరిపాలిస్తున్న తబ్రిమ్మోను కుమారుడు, హెజ్యోను మనుమడు, సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.
19
అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
20
రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.
21
బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.
22
అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.
23
ఆసా పరిపాలన గురించిన ఇతర విషయాలు అతని విజయాలు అతడు చేసిందంతా అతడు కట్టించిన పట్టణాల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అతని వృద్ధాప్యంలో అతని పాదాలకు వ్యాధి సోకింది.
24
తర్వాత ఆసా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన పితరుడైన దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options