కంటెంట్‌కు వెళ్లండి

2 దినవృత్తాంతములు23

యెహోయాదా తిరుగుబాటుకు ఏర్పాట్లు చేయుట

1
ఏడవ సంవత్సరంలో యెహోయాదా తనను బలపరచుకొని యెరోహాము కుమారుడైన అజర్యా, యెహోహనాను కుమారుడైన ఇష్మాయేలు, ఓబేదు కుమారుడైన అజర్యా, అదాయా కుమారుడైన మయశేయా, జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు అనే శతాధిపతులతో నిబంధన చేశాడు.
2
వారు వెళ్లి యూదా అంతటా తిరుగుతూ అన్ని పట్టణాల నుండి లేవీయులను, ఇశ్రాయేలు కుటుంబాల నాయకులను సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చినప్పుడు,
3
సమాజమంతా దేవుని మందిరంలో రాజుతో ఒక నిబంధన చేశారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు: “దావీదు వంశస్థుల విషయంలో యెహోవా వాగ్దానం చేసినట్లుగా రాజు కుమారుడు పరిపాలన చేయాలి.
4
ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే: సబ్బాతు దినాన విధులకు వెళ్లే యాజకులలో లేవీయులలో మూడవ వంతు మంది తలుపుల దగ్గర కాపలాగా ఉండాలి.
5
ఇంకొక మూడవ భాగం రాజభవనం దగ్గర, మరో మూడవ భాగం పునాది ద్వారం దగ్గర కాపలా కాయాలి. మిగతావారంతా యెహోవా ఆలయ ఆవరణాల్లో ఉండాలి.
6
విధుల్లో ఉన్న యాజకులు, లేవీయులు తప్ప ఇంకెవరు యెహోవా మందిరంలో ప్రవేశించకూడదు. యాజకులు, లేవీయులు ప్రతిష్ఠించబడ్డ వారు కాబట్టి వారు ప్రవేశించవచ్చు, అయితే మిగతావారంతా లోనికి ప్రవేశించకూడదనే యెహోవా ఆజ్ఞను పాటించాలి.
7
లేవీయులు తమ ఆయుధాలు చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. ఎవరైనా మందిరంలోకి వస్తే వారిని చంపేయాలి. రాజు ఎక్కడికి వెళ్లినా అతనికి దగ్గరగా ఉండాలి.”
8
యాజకుడైన యెహోయాదా ఆదేశించినట్లే లేవీయులు, యూదా వారంతా చేశారు. ప్రతి ఒక్కరు సబ్బాతు దినం విధులకు వెళ్లేవారిని, సబ్బాతు దినం విధులకు వెళ్లని వారిని తీసుకువచ్చారు. ఎందుకంటే యాజకుడైన యెహోయాదా ఏ విభాగాల వారికి సెలవియ్యలేదు.
9
అప్పుడు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో ఉన్న రాజైన దావీదుకు చెందిన ఈటెలు, పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, ఆ శతాధిపతులకు ఇచ్చాడు.
10
అతడు ఆయుధాలను పట్టుకుని ఉన్న సైనికులందరిని యెహోవా మందిరం దక్షిణ వైపు నుండి ఉత్తర వైపు వరకు బలిపీఠం దగ్గర, మందిరం దగ్గర, రాజు చుట్టూ ఉండేలా నిలబెట్టాడు.
11
అప్పుడు యెహోయాదా, అతని కుమారులు రాకుమారున్ని బయటకు తీసుకువచ్చి అతని తలమీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రాన్ని అతనికి అందించి, వారు అతన్ని రాజుగా ప్రకటించారు. వారు అతన్ని రాజుగా అభిషేకించి, “రాజు చిరకాలం జీవించు గాక!” అని కేకలు వేశారు.

అథల్యా వధింపబడుట

12
ప్రజలు పరుగులు పెడుతూ రాజును పొగుడుతూ చేసే ధ్వనిని అతల్యా విని, ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న వారి దగ్గరకు వెళ్లింది.
13
ఆమె చూడగా, అక్కడ రాజు తన అధికార స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అధిపతులు బూరలు ఊదేవారు రాజు ప్రక్కన ఉన్నారు దేశ ప్రజలంతా సంబరపడుతూ బూరలు ఊదుతూ ఉన్నారు సంగీతకారులు తమ వాయిద్యాలతో స్తుతి పాటలు పాడడం చూసి అతల్యా తన వస్త్రాలు చింపుకొని, “ద్రోహం! ద్రోహం!” అని అరిచింది.
14
అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలో శతాధిపతులైన వారిని పంపించి, “మీ వరుసల మధ్య నుండి ఆమెను బయటకు తీసుకురండి, ఆమె వెంట వచ్చేవారిని ఖడ్గంతో చంపేయండి” అని అన్నాడు. ఎందుకంటే యాజకుడు, “ఆమెను యెహోవా మందిరం దగ్గర చంపవద్దు” అని చెప్పాడు.
15
కాబట్టి ఆమె రాజభవన ఆవరణంలో గుర్రపు ద్వారం యొక్క ప్రవేశం దగ్గరకు చేరుకోగానే వారు ఆమెను పట్టుకుని చంపేశారు.

నిబంధన పునరుద్ధరణ మరియు సంస్కరణ

16
అప్పుడు యెహోయాదా, తాను ప్రజలు రాజు యెహోవా ప్రజలుగా ఉండాలని నిబంధన చేశాడు.
17
ప్రజలందరూ బయలు గుడి దగ్గరకు వెళ్లి దానిని పడగొట్టారు. వారు బలిపీఠాలను, విగ్రహాలను పగులగొట్టారు, బలిపీఠాల ముందున్న బయలు యాజకుడైన మత్తానును చంపారు.
18
అప్పుడు యెహోయాదా, దావీదు ఆదేశించిన ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు సంతోషంతో పాడుతూ, యెహోవాకు దహనబలులను అర్పించడానికి, మందిరంలో దావీదు నియమించిన లేవీయులకు యాజకులకు యెహోవా ఆలయ పర్యవేక్షణ అప్పగించాడు.
19
ఏ విధంగానైనా అపవిత్రంగా ఉన్నవారు ఎవరూ లోపలికి రాకుండా అతడు యెహోవా ఆలయ ద్వారాల దగ్గర ద్వారపాలకులను కూడా నిలబెట్టాడు.
20
అతడు తనతో శతాధిపతులను, ప్రధానులను, ప్రజల అధికారులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా మందిరం నుండి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు పై ద్వారం గుండా ప్రవేశించి, రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు.
21
అతల్యాను ఖడ్గంతో చంపిన తర్వాత పట్టణం ప్రశాంతంగా ఉంది, దేశ ప్రజలంతా సంబరపడ్డారు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options