Skip to content
లేవీయకాండము 14:33-57

లేవీయకాండము 14:33-57

33
యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
34
“మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే,
35
వెంటనే ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరకు వెళ్లి, ‘నేను నా ఇంట్లో అపవిత్రమైన మచ్చ చూశాను’ అని చెప్పాలి.
36
ఆ ఇంట్లో ఉన్నదంతా అపవిత్రంగా కాకుండ ఉండడానికి యాజకుడు ఆ మచ్చను పరీక్షించడానికి రాకముందే ఆ ఇళ్ళంతా ఖాళీ చేయించాలి. ఆ తర్వాత యాజకుడు లోపలికి వెళ్లి ఇంటిని పరీక్షించాలి.
37
అతడు గోడలపై ఉన్న మచ్చను పరీక్షించినప్పుడు ఆ గోడల మీద పచ్చని గీతలు గాని ఎర్రని గీతలు గోడ పగుళ్లలో ఉంటే,
38
యాజకుడు ఆ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లి ఏడు రోజులు దానిని మూసివేయాలి.
39
ఏడవ రోజున యాజకుడు ఆ ఇంటిని పరిశీలించడానికి మరలా రావాలి. ఒకవేళ గోడలపై మరక వ్యాపించి ఉంటే,
40
మచ్చలు ఉన్న ఆ రాళ్లను ఊడదీసి పట్టణానికి బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయమని యాజకుడు ఆదేశించాలి.
41
అతడు ఇంటి లోపలి గోడలన్నింటిని గీయించి ఆ చెత్తను పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
42
తీసివేసిన వాటి స్థానంలో వేరే రాళ్లు పెట్టి క్రొత్త బంకమట్టిని తీసుకుని ఇంటికి అడుసు పూయాలి.
43
“రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే,
44
యాజకుడు వెళ్లి దానిని పరీక్షించాలి, ఒకవేళ ఇంట్లో మరక వ్యాపించి ఉంటే అది అపవిత్రపరచే మరక; ఆ ఇల్లు అపవిత్రమైనది.
45
ఆ ఇంటిని దాని రాళ్లను కలపను అడుసును కూలగొట్టి వాటిని పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
46
“ఒకవేళ ఇల్లు మూసివేసి ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
47
ఆ ఇంట్లో పడుకునేవారు తినేవారు ఎవరైనా సరే తమ బట్టలు ఉతుక్కోవాలి.
48
“యాజకుడు వచ్చి దానిని పరీక్షించినప్పుడు ఆ ఇంటికి అడుసు పూసిన తర్వాత మరక వ్యాపించకపోతే, అపవిత్రం చేసే మరక పోయింది కాబట్టి ఆ ఇల్లు పవిత్రమని అతడు ప్రకటించాలి.
49
ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులను కొంచెం దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకోవాలి.
50
అతడు ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపాలి.
51
అప్పుడు అతడు దేవదారు కర్రను హిస్సోపును ఎర్రని నూలును బ్రతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోను మంచినీటిలోను ముంచి ఆ ఇంట్లో ఏడుసార్లు చల్లాలి.
52
అతడు ఇంటిని పక్షి రక్తంతోను మంచినీటితోను బ్రతికి ఉన్న పక్షితో దేవదారు కర్రతో హిస్సోపుతో ఎర్రని నూలుతో శుద్ధి చేయాలి.
53
అప్పుడు అతడు బ్రతికి ఉన్న పక్షిని పట్టణం బయట ఉన్న పొలాల్లో వదలివేయాలి. ఈ విధంగా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయాలి, అది శుద్ధి అవుతుంది.”
54
ఏదైనా కుష్ఠువ్యాధికైనా గజ్జిపుండ్లకైనా నియమాలు ఇవి,
55
వస్త్రాల్లో గాని ఇంట్లో గాని ఏర్పడే అపవిత్రపరచే మరకలకు,
56
వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా,
57
అవి పవిత్రమైనవా అపవిత్రమైనవా అని ఈ నిబంధనలు తెలియజేస్తాయి. కుష్ఠువ్యాధులు, అపవిత్రపరచే మరకలకు సంబంధించిన నియమాలు ఇవే.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options