Skip to content
యోహాను 7:32-49

యోహాను 7:32-49

32
ఆయన గురించి ఈ విషయాలను ఆ జనసమూహంలో గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు. అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు ఆయనను బంధించడానికి దేవాలయ సంరక్షకులను పంపించారు.
33
యేసు, “నేను మీతో కేవలం కొంతకాలమే ఉంటాను. తర్వాత నన్ను పంపినవాని దగ్గరకు నేను వెళ్తాను.
34
మీరు నా కోసం వెదకుతారు కాని, కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు” అని చెప్పారు.
35
అప్పుడు యూదుల నాయకులు ఒకరితో ఒకరు, “మనం కనుగొనలేని ఏ స్థలానికి ఇతడు వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదరిపోయి జీవిస్తున్న మన ప్రజల దగ్గరకు ఆయన వెళ్లి, గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా?
36
‘మీరు నన్ను వెదకుతారు కాని కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు’ అని ఈయన చెప్పిన దానికి అర్థం ఏమిటి?” అని చెప్పుకున్నారు.
37
పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి.
38
లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు.
39
ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.
40
ఆయన మాటలను విన్న తర్వాత ప్రజల్లో కొందరు, “ఈయన నిజంగానే ప్రవక్త” అని చెప్పుకున్నారు.
41
మరికొందరు, “ఈయనే క్రీస్తు” అన్నారు. అయినప్పటికీ ఇంకా కొందరు, “క్రీస్తు గలిలయ నుండి ఎలా వస్తాడు?
42
క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడలేదా?” అని చెప్పుకుంటున్నారు.
43
ఈ విధంగా క్రీస్తును గురించి ప్రజల్లో విభేదాలు ఏర్పడ్డాయి.
44
కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు, కాని ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు.
45
చివరికి దేవాలయ సంరక్షకులు తిరిగి ముఖ్య యాజకులు పరిసయ్యుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు, “అతన్ని మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు.
46
ఆ సంరక్షకులు, “ఆయన మాట్లాడే విధంగా ఇంతకుముందు ఎవ్వరూ మాట్లాడలేదు” అని చెప్పారు.
47
పరిసయ్యులు, “అంటే మిమ్మల్ని కూడా అతడు మోసగించాడా? అని అన్నారు.
48
అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా?
49
లేదు! ధర్మశాస్త్రం గురించి ఏమి తెలియని ఈ గుంపు నమ్ముతున్నారు, వారి మీద శాపం ఉంది” అన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options