యోహాను 6:53-66
53
అందుకు యేసు వారితో, “నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు.
54
నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు. చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను.
55
నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయము.
56
నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను.
57
సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు నేను తండ్రి వలననే జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవారు నా వలన జీవిస్తారు.
58
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు.
59
కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు.
60
అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, “ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?” అన్నారు.
61
యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకుంటున్నారని గ్రహించి వారితో, “ఈ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయా?
62
అయితే మనుష్యకుమారుడు తాను ఇంతకుముందు ఉన్న చోటికే ఎక్కిపోవడం చూస్తే ఏమంటారు?
63
ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.
64
అయినా మీలో కొందరు నమ్మడం లేదు” అన్నారు. ఎందుకంటే వారిలో ఎవరు మొదటి నుండి నమ్మడం లేదో, ఎవరు తనను అప్పగిస్తారో యేసుకు తెలుసు.
65
ఆయన వారితో, “ఈ కారణంగానే తండ్రి రానిస్తేనే తప్ప మరి ఎవరు నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.
66
అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు.
Settings