Skip to content
యోహాను 6:1-15

యోహాను 6:1-15

1
ఈ సంగతులు జరిగిన కొంతకాలానికి, యేసు గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తిబెరియ సముద్రతీరానికి వెళ్లారు.
2
అక్కడ ఆయన రోగులను స్వస్థపరచడం ద్వారా ఆయన చేసిన అసాధారణ సూచకక్రియలను చూసిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది.
3
అప్పుడు యేసు కొండ ఎక్కి తన శిష్యులతో పాటు అక్కడ కూర్చుని ఉన్నారు.
4
యూదుల పస్కా పండుగ సమీపించింది.
5
యేసు గొప్ప జనసమూహం తన దగ్గరకు రావడం చూసి ఫిలిప్పుతో, “ఈ ప్రజలు తినడానికి రొట్టెలను ఎక్కడ కొందాం?” అన్నారు.
6
తాను చేయబోయేది ఆయనకు ముందుగానే తెలుసు, కేవలం అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఆయన అడిగారు.
7
ఫిలిప్పు ఆయనతో, “ఒక్కొక్కరికి ఒక్కో చిన్నముక్క ఇవ్వడానికి సరిపడే రొట్టెలను కొనాలంటే రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది” అని చెప్పాడు.
8
ఆయన శిష్యులలో మరొకడు, సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ మాట్లాడుతూ,
9
“ఇక్కడ ఒక బాలుని దగ్గర అయిదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?” అన్నాడు.
10
అప్పుడు యేసు, “ప్రజలను కూర్చోబెట్టండి” అని చెప్పారు. అక్కడ చాలా పచ్చిక ఉంది కాబట్టి, ప్రజలు కూర్చున్నారు. అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు.
11
యేసు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు.
12
వారందరూ సరిపడినంత తిన్న తర్వాత ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు.
13
అందరు తిన్న తర్వాత మిగిలిన అయిదు యవల రొట్టె ముక్కలను పన్నెండు గంపలలో నింపారు.
14
యేసు చేసిన అద్భుత కార్యాన్ని చూసిన ప్రజలు, “నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు.
15
వారు తనను బలవంతంగా రాజును చేయాలని చూస్తున్నారని యేసు గ్రహించి తప్పించుకుని ఒంటరిగా కొండపైకి వెళ్లారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options