హోషేయ 10:1-8
1
ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.
2
వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.
3
అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.
4
వారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు ఒప్పందాలు చేసుకుంటారు; కాబట్టి వాదనలు దున్నబడిన పొలంలో విషపు మొక్కల్లా మొలుస్తాయి.
5
సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు.
6
అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.
7
సమరయ రాజు నాశనమవుతాడు, అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు.
8
ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన దుష్టత్వం కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి వారి బలిపీఠాలను కప్పుతాయి. అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.
Settings