Skip to content
2 సమూయేలు 15:13-23

2 సమూయేలు 15:13-23

13
ఒక దూత వచ్చి దావీదుతో, “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోము పక్షంగా ఉన్నారు” అనే వార్త చెప్పాడు.
14
దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
15
అందుకు రాజు అధికారులు, “మా ప్రభువైన రాజు ఏం చెప్పినా చేయడానికి మీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చారు.
16
అప్పుడు రాజు రాజభవనాన్ని కనిపెట్టుకుని ఉండడానికి పదిమంది ఉంపుడుగత్తెలను ఉంచి, తన పరివారమంతటితో కలిసి బయలుదేరి వెళ్లాడు.
17
రాజు తన పరివారమంతటితో కాలినడకను బయలుదేరి వెళ్లి పట్టణం చివరి ఉన్న ఇంట్లో బసచేశాడు.
18
రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు.
19
రాజు గిత్తీయుడైన ఇత్తయితో, “నీవు మాతో పాటు రావడం ఎందుకు? తిరిగివెళ్లి అబ్షాలోము రాజుతో పాటు ఉండు. నీవు బందీగా ఉన్న విదేశీయుడవు.
20
నీవు నిన్ననే వచ్చావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు నీవు మాతో తిరగడం ఎందుకు? నీ ప్రజలను తీసుకుని నీవు తిరిగి వెళ్లిపో. యెహోవా నీ మీద దయను నమ్మకత్వాన్ని చూపిస్తారు” అన్నాడు.
21
అందుకు ఇత్తయి రాజుతో, “నా ప్రభువైన రాజు ఎక్కడ ఉంటాడో నీ సేవకుడైన నేను మరణించినా బ్రతికినా అక్కడే ఉంటానని సజీవుడైన యెహోవా మీద, నా ప్రభువైన రాజు జీవం మీద ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.
22
దావీదు ఇత్తయితో, “సరే, నీవు మాతో రావచ్చు” అన్నాడు. కాబట్టి గిత్తీయుడైన ఇత్తయి అతనితో ఉన్న మనుష్యులు, కుటుంబాలు ముందుకు నడిచారు.
23
వారందరూ వెళ్లి పోతుంటే ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. ఇలా వారందరూ రాజుతో కలిసి కిద్రోనువాగు దాటి అరణ్యమార్గంలో కదిలారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options