1 సమూయేలు 20:27-34
27
అయితే అమావాస్య తర్వాతి రోజు అనగా నెలలో రెండవ రోజున దావీదు చోటు ఖాళీగా ఉండడం చూసి సౌలు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని యోనాతానును అడిగాడు.
28
అందుకు యోనాతాను, “బేత్లెహేము వెళ్లడానికి అనుమతి ఇవ్వమని నన్ను దావీదు ఎంతో ప్రాధేయపడి,
29
‘దయచేసి నన్ను వెళ్లనివ్వు, నా పట్టణంలో మా వంశస్థులు బలి ఇవ్వబోతున్నారు కాబట్టి నేను కూడా అక్కడ ఉండాలని నా అన్న నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నాపై దయచూపించి నేను వెళ్లి నా అన్నలను కలుసుకునేలా నన్ను వెళ్లనివ్వు’ అని నన్ను అడిగి వెళ్లాడు. ఆ కారణంగానే అతడు రాజు బల్ల దగ్గరకు రాలేదు” అని చెప్పాడు.
30
అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా?
31
యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీవు గాని నీ రాజ్యం గాని స్ధిరపడదు. కాబట్టి నీవు ఎవరినైనా పంపి అతన్ని నా దగ్గరకు రప్పించు, అతడు తప్పక చావాల్సిందే” అని చెప్పాడు.
32
అప్పుడు యోనాతాను, “అతడు మరణశిక్ష ఎందుకు పొందాలి? అతడు ఏమి చేశాడు?” అని సౌలును అడిగాడు.
33
కానీ సౌలు అతన్ని చంపడానికి ఈటె విసిరాడు. తన తండ్రి దావీదును చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అప్పుడు యోనాతాను గ్రహించాడు.
34
యోనాతాను తీవ్రమైన కోపంతో బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందుకు అతని కోసం దుఃఖిస్తూ, ఆ అమావాస్య పండుగ మరుసటిరోజు అతడు భోజనం చేయలేదు.
Settings