1 సమూయేలు 14:1-15
1
ఆ రోజు సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా, తన ఆయుధాలను మోసే యువకుని పిలిచి, “అవతల ఉన్న ఫిలిష్తీయుల పహారా కాచే సైన్యాన్ని చంపడానికి వెళ్దాం రా” అని అన్నాడు.
2
సౌలు గిబియా పొలిమేరల్లో మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద ఉన్నాడు, అతనితో పాటు సుమారు ఆరువందలమంది ఉన్నారు.
3
అహీయా ఏఫోదు ధరించుకొని వారి మధ్య ఉన్నాడు. అతడు షిలోహులో యెహోవాకు యాజకుడైన ఏలీ కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదుకు సోదరుడైన అహీటూబుకు పుట్టాడు. యోనాతాను వెళ్లిన సంగతి ఎవరికీ తెలియలేదు.
4
ఫిలిష్తీయుల సైనిక స్థావరాలను చేరడానికి యోనాతాను వెళ్లవలసిన దారికి ఇరువైపులా అటు ఒక చిన్న కొండ ఇటు ఒక చిన్న కొండ ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొసేసు రెండవ దాని పేరు సెనే.
5
మిక్మషుకు ఉత్తరం వైపు ఒక కొండ శిఖరం, గెబాకు దక్షిణం వైపు రెండవ కొండ శిఖరం ఉన్నాయి.
6
యోనాతాను తన ఆయుధాలను మోసే యువకునితో, “ఈ సున్నతిలేనివారి సైనిక స్థావరాల మీదికి వెళ్దాం రా, బహుశా యెహోవా మన కోసం కార్యం చేయవచ్చు. ఎక్కువ మంది నుండైనా కొద్దిమంది నుండైనా రక్షించడానికి యెహోవాకు ఏది అడ్డు కాదు” అని అన్నాడు.
7
అందుకు ఆ యువకుడు, “మీ మనస్సులో ఏముందో అది చెయ్యండి; పదండి, మీ నిర్ణయమేదైనా నేను మీతోనే ఉంటాను” అన్నాడు.
8
అప్పుడు యోనాతాను, “మనం వారి దగ్గరకు వెళ్లి వారు మనలను చూసేలా చేద్దాము.
9
వారు మనలను చూసి, మేము మీ దగ్గరకు వచ్చేవరకు అక్కడ ఉండమని చెప్తే, వారి దగ్గరకు వెళ్లకుండా మనమున్న చోటనే ఉందాము.
10
మా దగ్గరకు రండని వారు చెప్తే మనం పైకి ఎక్కుదాము. ఎందుకంటే యెహోవా వారిని మన చేతికి అప్పగించారనడానికి మనకు అదే గుర్తు” అన్నాడు.
11
వీరిద్దరు కావాలనే ఫిలిష్తీయుల సైనిక స్థావరాలకు కనిపించారు. అప్పుడు ఫిలిష్తీయులు, “చూడండి, తాము దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు” అన్నారు.
12
సైనిక స్థావరంలో నుండి ఒకడు యోనాతానును అతని ఆయుధాలను మోసేవాన్ని పిలిచి, “మీరైతే పైకి రండి, మీకు పాఠం నేర్పిస్తాం” అన్నాడు. యోనాతాను తన ఆయుధాలను మోసేవానితో, “నా వెనుకనే నీవు పైకి ఎక్కు; యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు” అని చెప్పాడు.
13
యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు తమ చేతులు కాళ్లను ఉపయోగించి పైకి ఎక్కారు. యోనాతాను దెబ్బకు ఫిలిష్తీయులు పడిపోగా అతని వెనుక వస్తున్న అతని ఆయుధాలను మోసేవాడు వారిని చంపాడు.
14
యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు చేసిన ఆ మొదటి దాడిలో దాదాపుగా ఇరవైమంది చనిపోయారు; అర ఎకరం నేలలో అది జరిగింది.
15
శిబిరంలో పొలంలో ఉన్న సైన్యమంతటిలో భయాందోళనలు అలుముకున్నాయి. సైనిక స్థావరంలో ఉన్నవారు, దోచుకునేవారు భయపడ్డారు, భూమి కంపించింది. అది దేవుని వలన కలిగిన భయము.
Settings