1 సమూయేలు 14:24-35
24
“సాయంత్రం అయ్యేవరకు, నేను నా శత్రువుల మీద పగతీర్చుకునే వరకు ఎవరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు” అని సౌలు ప్రజలచేత ప్రమాణం చేయించాడు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులందరు ఏమీ తినలేదు.
25
సైన్యమంతా అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ నేల మీద తేనె కనపడింది.
26
వారు ఆ అడవిలోకి వెళ్లగా తేనె ధారలుగా కారుతూ ఉంది కాని ప్రజలు తాము చేసిన ప్రమాణానికి భయపడి ఒకరు కూడా చేయి నోటిలో పెట్టుకోలేదు.
27
అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి.
28
అప్పుడు ఒక సైనికుడు అతనితో, “ ‘ఈ రోజు భోజనం చేసినవారు శపించబడతారు’ అని మీ తండ్రి సైన్యంతో ఖచ్చితమైన ప్రమాణాన్ని చేయించాడు; అందుకే ప్రజలంతా అలసిపోయి ఉన్నారు” అని చెప్పాడు.
29
అందుకు యోనాతాను, “దేశం కష్టపడడానికి నా తండ్రి కారణమయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్లు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడు.
30
ప్రజలు తమ శత్రువుల నుండి దోచుకున్న దానిలో నుండి కొంచెం తిని ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది ఫిలిష్తీయులను జయించేవారం కదా!” అన్నాడు.
31
ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు చంపి చాలా అలసిపోయారు.
32
ప్రజలు దోపుడుసొమ్ము మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను దూడలను తీసుకుని నేల మీద పడవేసి వధించి రక్తంతో కలిపి తిన్నారు.
33
అప్పుడు ఒకడు సౌలుతో, “ప్రజలు రక్తంతో ఉన్న మాంసాన్ని తిని యెహోవా దృష్టిలో పాపం చేస్తున్నారు” అని చెప్పాడు. సౌలు, “మీరు విశ్వాసఘాతకులయ్యారు; ఒక పెద్ద రాయిని నా దగ్గరకు దొర్లించి తీసుకురండి.”
34
తర్వాత అతడు, “మీరు ప్రజల మధ్యకు వెళ్లి, ‘మీలో ప్రతి ఒక్కరు తమ ఎద్దులను గొర్రెలను నా దగ్గరకు తీసుకువచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో ఉన్న మాంసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయకూడదని వారితో చెప్పండి’ ” అని చెప్పి కొందరిని పంపించాడు. కాబట్టి ప్రజలందరు ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించారు.
35
అప్పుడు సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే.
Settings