Gadarenes గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఆయన గలిలయ అవతలి ఒడ్డున ఉన్న గదరేనీ ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడంతో ఎవరూ ఆ దారిన వెళ్లలేకపోయారు.
అవి ఆయనను చూసిన వెంటనే, “దేవుని కుమారుడా! మాతో నీకేమి? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశాయి.
వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
ఆ దయ్యాలు యేసును, “నీవు మమ్మల్ని బయటకు వెళ్లగొట్టాలనుకుంటే ఆ పందుల మందలోకి మమ్మల్ని పంపు” అని బ్రతిమాలాయి.
ఆయన ఆ దయ్యాలతో, “వెళ్లండి!” అన్నారు. కాబట్టి అవి బయటకు వచ్చి ఆ పందులలోనికి చొరబడగా ఆ పందుల మంద మొత్తం ఎత్తైన ప్రదేశం నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకుని వెళ్లి ఆ నీటిలో పడి చచ్చాయి.
ఆ పందులను కాస్తున్నవారు పట్టణంలోకి పరుగెత్తుకుని వెళ్లి జరిగిందంతా అంటే దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని విషయాలు చెప్పారు.
అప్పుడు ఆ పట్టణమంతా యేసును చూడడానికి వెళ్లారు. వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలారు.
వారు సరస్సు దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్లారు.
యేసు పడవ దిగిన వెంటనే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనను కలుసుకున్నాడు.
వాడు సమాధుల్లో నివసించేవాడు, గొలుసులతో కూడా ఎవరు వాన్ని బంధించలేకపోయారు.
ఎందుకంటే తరచుగా వాని కాళ్లుచేతులను గొలుసులతో బంధించేవారు కానీ, వాడు ఆ గొలుసులను తెంపి వాటిని ముక్కలు చేసేవాడు. వాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు.
వాడు పగలు రాత్రులు సమాధుల మధ్య, కొండల్లో కేకలువేస్తూ తనను తాను రాళ్లతో గాయపరచుకొనే వాడు.
వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు.
వాడు బిగ్గరగా కేకలువేస్తూ, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? దేవుని పేరట నన్ను వేధించవద్దు నిన్ను వేడుకొంటున్నాను!” అని అన్నాడు.
ఎందుకంటే యేసు, “అపవిత్రాత్మా, వీన్ని విడిచిపో!” అని వానితో అన్నారు.
అప్పుడు యేసు, “నీ పేరేమిటి?” అని వాన్ని అడిగారు. అందుకు వాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం” అని జవాబిచ్చాడు.
“వాటిని ఆ ప్రాంతం నుండి బయటకు పంపివేయవద్దని” వాడు యేసును పదే పదే వేడుకున్నాడు.
అక్కడ దగ్గరలో పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది.
ఆ దయ్యాలు, “ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని యేసును బ్రతిమాలాయి.
ఆయన వాటికి అనుమతి ఇచ్చారు, ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందులలోనికి చొరబడ్డాయి. ఇంచుమించు రెండువేల పందులు గల ఆ మంద, వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ జరిగినదంతా తెలియజేశారు, అప్పుడు ఏమి జరిగిందో చూడడానికి ప్రజలు వెళ్లారు.
వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, సేన దయ్యం పట్టినవాడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, అక్కడ కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.
జరిగింది చూసినవారు దయ్యాలు పట్టినవాని గురించి పందుల గురించి ఊరి వారికి తెలియజేశారు.
అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు.
యేసు పడవ ఎక్కుతున్నప్పుడు, దయ్యాలు పట్టినవాడు ఆయనతో పాటు వస్తానని బ్రతిమాలాడు.