Skip to content
లూకా 19:28-40

లూకా 19:28-40

28
యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేముకు ప్రయాణమై వెళ్లారు.
29
ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియ గ్రామాల సమీపంలో ఉన్నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ,
30
“మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో మీరు ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడకు తీసుకురండి.
31
‘మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి.”
32
ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు
33
వారు ఆ గాడిద పిల్లను విప్పుతుంటే, దాని యజమానులు, “మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
34
అందుకు వారు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు.
35
వారు దానిని యేసు దగ్గరకు తీసుకువచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ వస్త్రాలను వేశారు, యేసు దానిపై కూర్చున్నారు.
36
ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు.
37
ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్భుతాలన్నిటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:
38
“ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక!” “ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!” అని దేవుని స్తుతించారు.
39
ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసుతో, “బోధకుడా, నీ శిష్యులను గద్దించు!” అన్నారు.
40
ఆయన వారితో, “నేను చెప్తున్నాను, వీరు ఊరుకుంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options