యోహాను 19:17-27
17
యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు.
18
అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు.
19
పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును తగిలించాడు. అది ఇలా ఉంది: నజరేతువాడైన యేసు, యూదుల రాజు.
20
యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటనను హెబ్రీ, లాటిను గ్రీకు భాషల్లో వ్రాయించారు కాబట్టి యూదుల్లో చాలామంది దానిని చదివారు.
21
ముఖ్య యాజకులైన యూదులు దానిని వ్యతిరేకించి పిలాతును, “యూదుల రాజు అని వ్రాయవద్దు కాని యూదులకు రాజునని చెప్పుకునేవాడు” అని వ్రాయమని అడిగారు.
22
అందుకు పిలాతు, “నేను వ్రాసిందేదో వ్రాసేసాను” అని జవాబిచ్చాడు.
23
సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన వస్త్రాలను తీసుకుని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే వస్త్రంగా నేయబడింది.
24
కాబట్టి వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకుందాం” అని చెప్పుకొన్నారు. లేఖనంలో వ్రాయబడినట్లు, “వారు నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు” అనేది నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
25
యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు.
26
యేసు అతని తల్లి తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉండడం చూసి, ఆయన తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కుమారుడు” అని,
27
తర్వాత తన ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అని చెప్పారు. అప్పటినుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
Settings