యోబు 4:12-21
12
“నాకొక విషయం రహస్యంగా తెలిసింది, నా చెవులు దాని గుసగుసను విన్నాయి.
13
ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,
14
భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.
15
ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
16
అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.
17
‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?
18
దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,
19
మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!
20
ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.
21
వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’
Settings