యెషయా 28:14-22
14
కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి.
15
“మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు.
16
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.
17
నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.
18
చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.
19
అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది ఈడ్చుకెళ్తుంది.” ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు చాలా భయం పుడుతుంది.
20
పడుకోడానికి మంచం పొడవు సరిపోదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
21
నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని అపూర్వమైన తన పని చేయడానికి ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు.
22
ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.
Settings