గలతీయులకు 1:11-24
11
సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి.
12
నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.
13
నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు.
14
నా స్వజనులలో నా వయస్సుగల అనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వికుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది.
15
కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు,
16
తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు. దానికి నేను వెంటనే మనుష్యులను సంప్రదించలేదు.
17
అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను.
18
మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను.
19
ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు.
20
నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను.
21
ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను.
22
యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు.
23
వారు, “ఇంతకుముందు మనల్ని హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని మాత్రమే విన్నారు.
24
కాబట్టి వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.
Settings