Skip to content
2 సమూయేలు 21:15-22

2 సమూయేలు 21:15-22

15
తర్వాత మరోసారి ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగింది. దావీదు తన సైనికులతో కలిసి వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి అలసిపోయాడు.
16
అక్కడ రాఫా సంతతివాడైన ఇష్బి-బెనోబు అనేవాడు క్రొత్త ఖడ్గం, మూడువందల షెకెళ్ళ బరువు ఉన్న ఇత్తడి ఈటె పట్టుకుని, “దావీదును చంపుతాను” అని అన్నాడు.
17
అయితే సెరూయా కుమారుడైన అబీషై దావీదును కాపాడి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. అప్పుడు దావీదు మనుష్యులు, “ఇశ్రాయేలీయుల దీపమైన నీవు ఆరిపోకుండా ఉండేలా నీవు ఇకపై మాతో పాటు యుద్ధానికి రావద్దు” అని దావీదుతో ప్రమాణం చేయించారు.
18
కొంతకాలం తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై రాఫా వారసులలో ఒకడైన సఫును చంపాడు.
19
గోబు దగ్గర ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో బేత్లెహేమీయుడైన యాయీరు కుమారుడు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సోదరున్ని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
20
గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.
21
అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.
22
ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options