2 రాజులు 4:38-44
38
తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు.
39
వారిలో ఒకడు కూర ఆకుల కోసం పొలాలకు వెళ్లాడు, వెర్రి ద్రాక్ష అతనికి దొరికింది, దాని తీగెలు కోసి అతడు తన వస్త్రం నిండ నింపుకున్నాడు. అవి విషపూరితమైనవని అతనికి తెలియక వాటిని తరిగి కూర కుండలో వేశాడు.
40
ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.
41
ఎలీషా, “పిండి కొంచెం తీసుకురండి” అన్నాడు. అతడు పిండిని కుండలో వేసి, “ప్రజలు తినడానికి దానిని వారికి వడ్డించండి” అన్నాడు. అప్పుడు కుండలో హానికరమైనదేది లేదు.
42
ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.
43
అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు. అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.
44
అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.
Settings