2 రాజులు 22:13-20
13
“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ప్రజల కోసం యూదా అంతటి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు; మనలను ఉద్దేశించి అందులో వ్రాయబడిన ప్రకారం వారు చేయలేదు.”
14
యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది.
15
ఆమె వారితో, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి,
16
‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను.
17
ఎందుకంటే, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన విగ్రహాలన్నిటి బట్టి నాకు కోపం రేపారు, నా కోపం ఈ స్థలంపై రగులుకుంటుంది, అది చల్లారదు.’
18
యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
19
వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.
20
కాబట్టి నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు’ ” అని చెప్పింది. అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
Settings