2 దినవృత్తాంతములు 29:20-30
20
మరుసటిరోజు ఉదయమే లేచి రాజైన హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్లాడు.
21
వారు రాజ్యం కోసం, పరిశుద్ధాలయం కోసం, యూదా వారి కోసం బలిగా ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్లు, ఏడు గొర్రెలు, ఏడు మేకపోతులు తెచ్చారు. అది పాపపరిహారబలిగా తెచ్చారు. అహరోను వారసులైన యాజకులను, “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించాలి” అని రాజు ఆదేశించాడు.
22
అప్పుడు వారు కోడెలను వధించారు. యాజకులు వాటి రక్తం తీసుకుని బలిపీఠం మీద చల్లారు. తర్వాత పొట్టేళ్ళను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
23
పాపపరిహారబలిగా ఉన్న మేకపోతులను రాజు ఎదుట సమకూడినవారి ఎదుటకు తెచ్చారు. వారు వాటి మీద చేతులుంచారు.
24
అప్పుడు యాజకులు వాటిని వధించి, ఇశ్రాయేలు ప్రజలు బలిగా వాటి రక్తం బలిపీఠం మీద పోశారు. ఇశ్రాయేలు ప్రజలందరి ప్రాయశ్చిత్తంగా దహనబలి, పాపపరిహారబలి అర్పించాలని రాజు ఆదేశించాడు, కాబట్టి వారు అలా చేశారు.
25
మునుపు దావీదు రాజు, అతని దీర్ఘదర్శియైన గాదు, ప్రవక్తయైన నాతాను ఆదేశించిన ప్రకారం, హిజ్కియా లేవీయులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాయిద్యాలతో యెహోవా మందిరంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు.
26
దావీదు చేయించిన వాయిద్యాలను లేవీయులు, బూరలను యాజకులు చేతపట్టుకుని నిలబడ్డారు.
27
బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. బలిపీఠం మీద దహనబలులు అర్పించడం ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాకు స్తుతి పాటలు పాడడం ఆరంభమైంది.
28
గాయకులు పాటలు పాడుతూ, సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తూ, బూరల ఊదుతూ ఉండగా సమాజమంతా తలలు వంచి ఆరాధించారు. దహనబలి అర్పణ ముగిసేవరకు ఇదంతా జరుగుతూ ఉండింది.
29
దహనబలులు ముగిసినప్పుడు రాజు, అతనితో ఉన్నవారంతా మోకరించి ఆరాధన చేశారు.
30
దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు.
Settings