2 దినవృత్తాంతములు 20:20-30
20
తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు”
21
ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”
22
వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు.
23
ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
24
యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు.
25
కాబట్టి యెహోషాపాతు అతని మనుష్యులు వారి దోపుడుసొమ్మును దోచుకోవడానికి వెళ్లి, అక్కడ వారి మధ్య చాలా సామాగ్రి, వస్త్రాలు విలువైన వస్తువులు ఉండడం చూశారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగుచేయడానికి మూడు రోజులు పట్టింది.
26
నాలుగో రోజు వారు బెరాకా లోయలో సమకూడి యెహోవాను స్తుతించారు. అందుకే ఆ చోటు నేటి వరకు బెరాకాలోయ అని పిలువబడుతుంది.
27
అప్పుడు, యెహోషాపాతు నేతృత్వంలో, యూదా యెరూషలేము ప్రజలందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎందుకంటే వారి శత్రువులపై యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు.
28
వారు యెరూషలేములో ప్రవేశించి, రకరకాల సితార వీణలతో, బూరలతో యెహోవా ఆలయానికి చేరుకున్నారు.
29
ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా ఎలా పోరాడారో విన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ దేవుని భయం కలిగింది.
30
యెహోషాపాతు రాజ్యం సమాధానంతో ఉంది, ఎందుకంటే యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి అన్నివైపులా విశ్రాంతి ఇచ్చారు.
Settings