1 రాజులు 20:22-30
22
తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, “ధైర్యం తెచ్చుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో, ఎందుకంటే, వచ్చే వసంతకాలంలో అరాము రాజు మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు.”
23
ఇంతలో అరాము రాజు పరివారం అతనితో, “ఇశ్రాయేలు దేవుళ్ళు కొండల దేవుళ్ళు. అందుకే వారు మనకంటే బలంగా ఉన్నారు. కాని మనం సమతల మైదాన ప్రాంతంలో వారితో పోరాడితే మనం తప్పనిసరిగా గెలుస్తాము.
24
ఇలా చేయండి: రాజులందరినీ తొలగించి వారికి బదులు అధిపతులను నియమించండి.
25
మీరు పోగొట్టుకున్న సైన్యంలాంటి మరో సైన్యాన్ని సమకూర్చండి అంటే గుర్రానికి గుర్రం, రథానికి రథం. తద్వారా ఇశ్రాయేలుతో మైదాన ప్రాంతంలో యుద్ధం చేయవచ్చు. అప్పుడు మనం వారిపై గెలుస్తాం” అని చెప్పారు. అతడు వారి సలహా అంగీకరించి అల చేశాడు.
26
మరుసటి వసంతకాలంలో, బెన్-హదదు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి అరాము సైన్యాన్ని పోగుచేసి, ఆఫెకు ప్రాంతానికి వెళ్లాడు.
27
ఇశ్రాయేలీయులు కూడా తమ సైన్యాన్ని పోగుచేసుకుని సామాగ్రి పొందుకున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు రెండు చిన్న మేకల మందలా వారికి ఎదురుగా బస చేశారు, మరోవైపు అరామీయులు గ్రామీణ ప్రాంతాల్లో నిండి ఉన్నారు.
28
దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెహోవా కొండ దేవుడే గాని లోయ దేవుడు కాదని అరామీయులు అనుకుంటున్నారు కాబట్టి, ఈ గొప్ప సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
29
వారు ఏడు రోజులు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఉన్నారు, ఏడవ రోజున యుద్ధం ఆరంభమైంది. ఆ ఒక్క రోజున ఇశ్రాయేలీయులు అరాము కాల్బలంలో లక్ష మందికి ప్రాణనష్టం కలిగించారు.
30
మిగతావారు ఆఫెకు పట్టణముకు పారిపోయారు, వారిలో ఇరవై ఏడు వేలమంది మీద ప్రాకారం కూలింది. బెన్-హదదు పట్టణానికి పారిపోయి లోపలి గదిలో చొరబడ్డాడు.
Settings