1 రాజులు 16:24-33
24
అతడు షెమెరు దగ్గర సమరయ కొండను రెండు తలాంతుల వెండికి కొని దాని మీద పట్టణం కట్టించి, ఆ కొండకు మునుపటి యజమానియైన షెమెరు పేరిట దానికి సమరయ అని పేరు పెట్టాడు.
25
అయితే ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతని ముందున్న వారందరికంటే ఇంకా ఎక్కువ పాపం చేశాడు.
26
అతడు నెబాతు కుమారుడైన యరొబాము ఎలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమై తమ అయోగ్యమైన విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడో అదే విధానాన్ని అనుసరించాడు.
27
ఒమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
28
ఒమ్రీ చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహాబు రాజయ్యాడు.
29
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
30
ఒమ్రీ కుమారుడైన అహాబు అతని ముందున్న వారందరికంటే యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు.
31
అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.
32
అతడు సమరయలో బయలు గుడిని కట్టించి, అందులో బయలుకు బలిపీఠాన్ని నిర్మించాడు.
33
అహాబు అషేరా స్తంభాలను కూడా నిలిపి, ముందు ఉన్న ఇశ్రాయేలు రాజులందరికి కంటే ఎక్కువగా పాపం చేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.
Settings