లూకా 9:18-27
18
ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, అప్పుడు ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని వారిని అడిగారు.
19
అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని; కొందరు ఏలీయా అని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు.
20
అయితే ఆయన, “నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు పేతురు, “దేవుని అభిషిక్తుడు అనగా క్రీస్తు” అని చెప్పాడు.
21
ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు.
22
ఆయన వారితో, “మనుష్యకుమారుడు అనేక శ్రమలు పొందాలి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడాలి, ఆయన చంపబడి మూడవ రోజున తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
23
ఆ తర్వాత ఆయన వారందరితో, “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.
24
తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు.
25
ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం?
26
ఎవరైనా నా గురించి గాని నా మాటల గురించి గాని సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.
27
“ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
Settings