లూకా 20:9-19
9
ఆయన ప్రజల వైపు తిరిగి ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు: “ఒక మనుష్యుడు ద్రాక్షతోటను నాటించి, దానిని కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి, దూర దేశానికి వెళ్లి చాలా కాలం అక్కడే ఉన్నాడు.
10
కోతకాలం వచ్చినప్పుడు అతడు ఒక పనివానిని ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఆ రైతుల దగ్గరకు పంపాడు, కాని ఆ రైతులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు.
11
మళ్ళీ అతడు మరొక పనివానిని పంపించాడు. వారు వానిని కూడా కొట్టి అవమానపరచి, వట్టి చేతులతో పంపారు.
12
మళ్ళీ అతడు మూడవ వానిని పంపించాడు. వారు వానిని గాయపరచి బయటకు తోసివేసారు.
13
“అప్పుడా ద్రాక్షతోట యజమాని ‘నేనేమి చేయాలి? నేను ప్రేమించే నా కుమారున్ని పంపిస్తాను, వారు ఒకవేళ అతన్ని గౌరవిస్తారేమో’ అని అనుకున్నాడు.
14
“కాని ఆ కౌలు రైతులు అతన్ని చూసి, ‘ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని ఒకనితో ఒకరు చెప్పుకొని,
15
కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు. “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు?
16
అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు” అని చెప్పారు. అది విన్న వారు, “అలా ఎన్నటికి కాకూడదు” అన్నారు.
17
యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాల్లో, “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి?
18
ఈ రాయి మీద పడిన ప్రతివారు ముక్కలైపోతారు, కాని ఎవరి మీద రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
19
ఇది విన్న ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి, ఎలాగైనా ఆయనను త్వరగా బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని ప్రజలకు భయపడ్డారు.
Settings