యోహాను 8:48-59
48
అందుకు యూదులు ఆయనతో, “నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పింది నిజం కాదా?” అన్నారు.
49
యేసు, “నేను దయ్యం పట్టినవాడను కాను. నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు.
50
నేను నా ఘనత కోసం వెదకడం లేదు; కానీ ఘనత కోసం వెదికేవాడు ఉన్నాడు, ఆయనే న్యాయమూర్తి.
51
నా మాటలకు లోబడేవారు ఎన్నడు చావరని నేను మీతో చెప్పేది నిజం” అని వారికి చెప్పారు.
52
ఈ విధంగా చెప్పగానే యూదులు, “నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మాకు తెలిసింది! అబ్రాహాము, అలాగే ప్రవక్తలు కూడ చనిపోయారు, అయినా ‘నా మాటలకు లోబడేవారు ఎన్నడు చావరు’ అని నీవంటున్నావు.
53
మా తండ్రియైన అబ్రాహాము కన్నా నీవు గొప్పవాడవా? అతడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నిన్ను నీవు ఎవరని అనుకుంటున్నావు?” అని అడిగారు.
54
అందుకు యేసు, “నన్ను నేను ఘనపరచుకుంటే ఆ ఘనత వట్టిదే. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను ఘనపరుస్తున్నారు.
55
మీకు ఆయన ఎవరో తెలియదు, కాని ఆయన నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదని నేను చెప్తే నేను కూడా మీలాగే అబద్ధికుని అవుతాను. కానీ ఆయన నాకు తెలుసు నేను ఆయన మాటకు లోబడతాను.
56
మీ తండ్రియైన అబ్రాహాము నేనున్న రోజును చూడాలన్న ఆలోచనకే ఆనందించాడు; అతడు దాన్ని చూసి సంతోషించాడు” అని చెప్పారు.
57
అందుకు యూదులు, “నీకు యాభై సంవత్సరాలు కూడ లేవు, నీవు అబ్రాహామును చూశావా!” అని ఆయనను అడిగారు.
58
అందుకు యేసు, “అబ్రాహాము పుట్టక ముందే నేనున్నాను! అని నేను మీతో చెప్పేది నిజం” అన్నారు.
59
అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్లు తీశారు. కానీ యేసు వారికి కనబడకుండ దేవాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.
Settings