యోహాను 3:23-36
23
సలీము దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో నీరు సమృద్ధిగా ఉండేది కాబట్టి యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చేవాడు. ప్రజలు వచ్చి బాప్తిస్మాన్ని పొందేవారు.
24
ఇదంతా యోహాను చెరసాలలో వేయబడక ముందు.
25
ఒక రోజు శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులలో కొందరికి ఒక యూదునితో వివాదం ఏర్పడింది.
26
వారు యోహాను దగ్గరకు వచ్చి అతనితో, “రబ్బీ, యొర్దాను నదికి అవతల నీతో పాటు ఉన్నవాడు, నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చావో, అతడు కూడా బాప్తిస్మమిస్తున్నాడు. అందరు అతని దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.
27
అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి వారికి ఇవ్వబడితేనే గాని ఎవరు దేనిని పొందలేరు.
28
‘నేను క్రీస్తును కాను, నేను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను’ అని నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు.
29
పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకునే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు. పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది.
30
ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”
31
పైనుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూలోకానికి చెందిన వాడు, భూలోక సంబంధిగానే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు.
32
ఆయన తాను చూసినవాటిని, వినిన వాటిని గురించి సాక్ష్యం ఇస్తారు, కానీ ఎవరు ఆయన సాక్ష్యాన్ని అంగీకరించరు.
33
ఆయన సాక్ష్యాన్ని అంగీకరించేవారు దేవుడు సత్యవంతుడని ధ్రువీకరిస్తారు.
34
ఎందుకంటే దేవుడు పరిమితి లేకుండా ఆత్మను అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు పంపినవాడు దేవుని మాటలనే మాట్లాడతాడు.
35
తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తం ఆయన చేతులకు అప్పగించారు.
36
కుమారునిలో నమ్మకం ఉంచే వారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కాబట్టి వాడు జీవాన్ని చూడడు.
Settings