యోహాను 21:9-19
9
వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను కొన్ని రొట్టెలను చూశారు.
10
యేసు వారితో, “మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకురండి” అని చెప్పారు.
11
సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు.
12
యేసు వారితో, “రండి, భోజనం చేయండి” అని పిలిచారు. ఆయనే ప్రభువని వారికి తెలిసింది కాబట్టి ఆ శిష్యులలో ఎవరు ఆయనను, “నీవు ఎవరు?” అని అడగడానికి ధైర్యం చేయలేదు.
13
యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచారు. అదే విధంగా చేపలను కూడ పంచారు.
14
యేసు తాను చనిపోయి సజీవునిగా లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడడం ఇది మూడవసారి.
15
వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. అతడు, “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అయితే, “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు.
16
మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవసారి అడిగారు. అతడు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు.
17
యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. యేసు తనను మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము”
18
నేను మీతో చెప్పేది నిజం, “నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు” అని చెప్పారు.
19
పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, “నన్ను వెంబడించు” అని చెప్పారు.
Settings