Skip to content
యోహాను 11:17-37

యోహాను 11:17-37

17
యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు.
18
యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
19
చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు.
20
మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21
మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.
22
ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది.
23
యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు.
24
అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది.
25
యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.
26
బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు.
27
ఆమె, “అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28
ఆమె ఈ మాట చెప్పిన తర్వాత, ఆమె వెనుకకు తిరిగివెళ్లి ఎవరికి తెలియకుండా తన సహోదరియైన మరియను ప్రక్కకు పిలిచి, “బోధకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని చెప్పింది.
29
మరియ అది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది.
30
అప్పటికి ఇంకా యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు.
31
మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం చూసి ఆమె ఏడ్వడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి ఆమె వెంట వెళ్లారు.
32
మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది.
33
ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ,
34
“మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు. అప్పుడు వారు, “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు.
35
యేసు ఏడ్చారు.
36
అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు.
37
అయితే వారిలో కొందరు, “గ్రుడ్డివాడి కళ్లను తెరిచిన ఈయన, ఇతనికి చావు రాకుండా చేయలేదా పోయాడా?” అన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options