యెషయా 66:18-23
18
“వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు.
19
“నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు.
20
ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
21
“యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెప్తున్నారు.
22
“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.
23
“ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
Settings