ఆదికాండము 48:1-11
1
కొంతకాలం తర్వాత, “నీ తండ్రి అస్వస్థతతో ఉన్నాడు” అని యోసేపుకు చెప్పబడింది. కాబట్టి తన ఇద్దరు కుమారులు, మనష్షేను ఎఫ్రాయిమును తీసుకెళ్లాడు.
2
“నీ కుమారుడు, యోసేపు నీ దగ్గరకు వచ్చాడు” అని యాకోబుకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకుని పడక మీద కూర్చున్నాడు.
3
యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి,
4
‘నేను నిన్ను ఫలవంతం చేస్తాను, నీ సంఖ్యను పెంచుతాను. నేను నిన్ను ప్రజల సమాజంగా చేస్తాను, నీ తర్వాత నీ వారసులకు ఈ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అని అన్నారు.
5
“కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు.
6
వారి తర్వాత నీకు పిల్లలు పుడితే వారు నీ సంతానమవుతారు; వారు వారసత్వంగా పొందిన భూభాగంలో వారు తమ సోదరుల పేర్లతో లెక్కించబడతారు.
7
నేను పద్దన నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.”
8
ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.
9
“వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు.
10
ఇశ్రాయేలు వృద్ధాప్యంలో ఉన్నందుకు దృష్టి మందగించింది కాబట్టి అతడు చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు తన కుమారులను అతనికి సమీపంగా తెచ్చాడు, తన తండ్రి వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
11
ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు.
Settings