నిర్గమకాండము 12:21-28
21
అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాడు, “మీరు వెంటనే వెళ్లి మీ కుటుంబాల కోసం మందలో నుండి గొర్రెపిల్లను ఎంచుకుని పస్కా గొర్రెపిల్లను వధించండి.
22
హిస్సోపు కొమ్మను తీసుకుని, పళ్ళెంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికి, రెండు నిలువు కమ్మీలకు పూయాలి. ఉదయం వరకు మీలో ఎవరూ మీ ఇంటి ద్వారం నుండి బయటకు రాకూడదు.
23
యెహోవా ఈజిప్టువారిని హతం చేయడానికి దేశమంతా సంచరిస్తూ, ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్మీలకు పూయబడిన రక్తాన్ని చూసి ఆయన ఆ ద్వారాన్ని దాటి వెళ్తారు. సంహారకుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని చంపడానికి ఆయన అనుమతించడు.
24
“మీకు మీ వారసులకు ఒక నిత్య కట్టుబాటుగా నా ఈ ఆదేశాలను పాటించాలి.
25
యెహోవా వాగ్దానం చేసినట్లుగా ఆయన మీకు ఇస్తానన్న దేశంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరించాలి.
26
‘ఈ వేడుకకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు
27
మీరు వారితో, ‘ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఈజిప్టువారిని చంపుతున్నప్పుడు ఈజిప్టులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను ఆయన ఏమీ చేయకుండా దాటి వెళ్లారు’ అని చెప్పాలి.” అప్పుడు ప్రజలు తలలు వంచి ఆరాధించారు.
28
యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన విధంగానే ఇశ్రాయేలీయులు చేశారు.
Settings