ప్రసంగి 7:15-29
15
నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను; నీతిమంతులు తమ నీతిలో నశించారు, దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు.
16
మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు, మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు, నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు?
17
మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు, మూర్ఖునిగా ఉండకు. సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి?
18
ఒకదాన్ని పట్టుకోవడం మరొకదాన్ని విడిచిపెట్టకపోవడం మంచిది. దేవునికి భయపడేవారు అన్ని విపరీతాలను అధిగమిస్తారు.
19
పట్టణంలోని పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది.
20
ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు.
21
ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు, లేకపోతే మీ సేవకుడు మిమ్మల్ని శపించడం మీరు వింటారు.
22
ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు.
23
నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను, “నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను” కాని అది నావల్ల కాలేదు.
24
జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు?
25
జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి, దుష్టత్వంలోని బుద్ధిహీనతను, మూర్ఖత్వంలోని వెర్రితనాన్ని గ్రహించడానికి, నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
26
నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను, అది వల వంటిది, ఉచ్చులాంటి మనస్సు కలిగి సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు. కాని ఆమె పాపులను పట్టుకుంటుంది.
27
ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే: “సంగతుల మూలకారణాలను తెలుసుకోడానికి ఒక దానికి మరొకదాన్ని జోడించాను.
28
నేను ఇంకా వెదకుతున్నాను కాని దొరకడం లేదు, వేయిమంది పురుషులలో ఒక్క యథార్థవంతుడు దొరికాడు, కానీ స్త్రీలందరిలో ఒక్క యథార్థవంతురాలు కూడా దొరకలేదు.
29
నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే; దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు, కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.”
Settings